Cyclone | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా దూసుకు వస్తోంది. కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్ఎప్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. మరో వైపు తుఫాను నేపథ్యంలో తమిళనాడులో ఆరు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.