న్యూఢిల్లీ, మార్చి 3: సెలబ్రిటీల పేర క్రెడిట్ కార్డులు తీసుకొని హైటెక్ మోసానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో జరిగింది. నిందితులు ఆధార్కార్డులను ఫోర్జరీ చేసి వాటిలో సెలబ్రిటీల వివరాలు నమోదు చేశారు. అభిషేక్ బచ్చన్, శిల్పా శెట్టి, మాధురి దీక్షిత్, ఇమ్రాన్ హష్మి, మహేంద్ర సింగ్ ధోనీల వివరాలను ఇందుకోసం వాడుకున్నారు. ఈ సెలబ్రిటీల జీఎస్టీ, పుట్టిన తేదీ వివరాలను గూగుల్లో తెలుసుకొని వారి పేరున పాన్ కార్డులను సృష్టించి అందులో తమ ఫొటోలను అప్లోడ్ చేశారు. ఇలా సృష్టించిన ఆధార్, పాన్ కార్డుల సాయంతో వన్ కార్డ్ కంపెనీ యాప్ నుంచి క్రెడిట్ కార్డులు పొందారు. ఆ కార్డులతో రూ.21.32 లక్షల విలువైన ఉత్పత్తులను కొన్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.