అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర హోంశాఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): పోలీసుల నుంచి ఫోన్ వచ్చినా.. మెసేజ్ వచ్చినా కొంత ఆందోళన కలుగుతుంది. ఇక ‘మీరు నేరానికి పాల్పడ్డారు’ అని పోలీసులే అంటే వణుకు మొదలవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పోలీసు పేరుతో వైరస్లను సృష్టిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ చొరబడ్డాక అది పాప్అప్ రూపంలో కంప్యూటర్ డెస్క్ టాప్, ఈ-మెయిల్, ఫేస్బుక్, మెసెంజర్లో ప్రత్యక్షమవుతుంది. ఇందులో ‘మీ కంప్యూటర్ను బ్లాక్ చేస్తున్నాం. మీరు పోర్నోగ్రఫీ సైట్ (అశ్లీల వెబ్సైట్)లను వీక్షిస్తున్నారు. ఇది నేరం. మీరు ఫైన్ కట్టాలి’ బెదిరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల నయా మోసాన్ని కేంద్ర హోంశాఖ పసిగట్టింది. పోలీసు లోగోతో వచ్చే పాప్అప్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భయపడి ఎవరికీ డబ్బు చెల్లించవద్దని స్పష్టంచేసింది. పాప్ అప్లతోపాటు గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయొద్దని సూచించింది. ఒకవేళ తెలియక ఎవరైనా జూదం, పోర్న్సైట్లను వీక్షించినా.. వారు ఈ పాప్అప్లకు భయపడాల్సిన అవసరంలేదని హోంశాఖ అధికారులు చెప్తున్నారు. పాప్అప్ల ద్వారా కేసులు పెడతామని, జరిమానాలు చెల్లించాలని పోలీసులు ఎప్పుడూ అడగరనే విషయాన్ని గుర్తించుకోవాలని స్పష్టంచేశారు.