కోల్కతా: తన సోదరుడు బాబూన్ బెనర్జీతో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. ఇక ఆయనకు నచ్చింది చేసుకోవచ్చని చెప్పారు. అలాగే తన తమ్ముడికి బీజేపీతో సంబంధాలున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘నేను, నా కుటుంబం బాబూన్తో అన్ని సంబంధాలు తెంచుకున్నాం’ అని మీడియాతో అన్నారు. ప్రతి ఎన్నికల ముందు ఆయన ఏదో ఒక సమస్య సృష్టిస్తాడని ఆమె విమర్శించారు. ‘నేను అత్యాశపరులను ఇష్టపడను. వంశపారంపర్య రాజకీయాలను నమ్మను. కాబట్టి అతడికి (ప్రసూన్ బెనర్జీ)కి ఎన్నికల్లో టికెట్ ఇస్తా. అందుకే బాబూన్ను తిరస్కరించా. సోదరుడితో అన్ని సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకున్నా’ అని అన్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల్లో హౌరా స్థానం నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి మరోసారి టికెట్ ఇస్తామని టీఎంసీ ప్రకటించింది. సీఎం మమతా బెనర్జీ సోదరుడు బాబూన్ బెనర్జీ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన ఆయన ఈ ఎంపిక పట్ల సంతోషంగా లేనని చెప్పారు. చాలా మంది సమర్థులైన అభ్యర్థులను పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రసూన్ తనకు చేసిన అవమానాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. అలాగే హౌరా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. కొందరు బీజేపీ నేతలతో తనకు పరిచయం ఉన్నప్పటికీ ఆ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు.