ముంబై: మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన జెండాల తొలగింపు నేపథ్యంలో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. అమరావతి జిల్లాలోని అచల్పూర్లో ఆదివారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. హిందూ, ముస్లింల పండగల సందర్భాల్లో అచల్పూర్ ప్రధాన ప్రవేశం వద్ద ఉండే ఖిడ్కీ గేట్, దుల్హా గేట్పై మతపరమైన జెండాలను స్థానికులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మతపర జెండాలను ఆదివారం అర్థ రాత్రి వేళ ఒక వర్గం వారు తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
మరోవైపు ఈ ఘర్షణ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులతోపాటు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పందించారు. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రెండు వర్గాలకు చెందిన 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడినట్లు ఎస్పీ శశికాంత్ సతవ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కర్ఫ్యూ విధించినట్లు వెల్లడించారు.