న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఈ ఏడాది సీయూఈటీ-యూజీ స్కోర్ నార్మలైజేషన్కు స్వస్తి పలికే అవకాశం ఉన్నదని యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్కుమార్ తెలిపారు. అలాగే అభ్యర్థి రాసే గరిష్ట పేపర్ల సంఖ్య 6కు పరిమితం చేస్తున్నట్టు చెప్పారు. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ పరీక్ష నిర్వహించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. దీని వల్ల చాలా మంది విద్యార్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
‘గత రెండేండ్లుగా ఒకే సబ్జెక్ట్ పేపర్ రెండు, మూడు రోజులు నిర్వహించాల్సి వచ్చేది. ఈసారి ఓఎంఆర్ విధానం వల్ల చాలా కాలేజీల్లో, పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లభిస్తుంది. దీంతో ఒకే రోజు పరీక్ష నిర్వహించొచ్చు. ఒకే సబ్జెక్ట్ పరీక్ష ఎక్కువ రోజులు నిర్వహించాల్సి రావడంతో స్కోర్ నార్మలైజేషన్ అవసరమయ్యేది. దీనిపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది’ అని వివరించారు.