ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించడాన్ని మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. పారిపోయిన తిరుగుబాటుదారులకు కాకుండా కశ్మీరీ పండిట్లకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ముంబైలోని శాంతాక్రూజ్లోని కలినాలో జరిగిన శివసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేవలం పిరికివాళ్లు మాత్రమే పార్టీ నుంచి పారిపోయారని విమర్శించారు. పార్టీ గుర్తు, శివసైనికుల ప్రేమను వారు ఎప్పటికీ పొందలేరని అన్నారు. ‘ధైర్యముంటే తిరిగి పోటీ చేయండి, మీకు వ్యతిరేకంగా మేం నిలబడతాం’ అని సవాల్ విసిరారు.
కాగా, శివసేన కార్యకర్తల నిరసనల నేపథ్యంలో తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండేతోసహా 15 మంది రెబల్ ఎమ్మెల్యేకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. దీంతో మహారాష్ట్రలోని వారి నివాసాల వద్ద ముంబై పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. అయితే ఈ చర్యను ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. మహారాష్ట్ర నుంచి అస్సాంలోని గౌహతికి పారిపోయిన రెబల్ ఎమ్మెల్యేలకు బదులుగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు బలవుతున్న కశ్మీరీ పండిట్లకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.