హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రపంచస్థాయి నాయకుడని రాజ్యసభసభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని చెప్పారు. శనివారం ఆన్లైన్ ద్వారా మారిషస్లో పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కేకే మాట్లాడుతూ.. ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తేవడం, సంస్కరణలకు బీజం వేయడం పీవీ నైజమని చెప్పారు. ఆయన కృషివల్లే ప్రస్తుతం దేశం ఈస్థాయిలో ఉన్నదని తెలిపారు. పీవీ కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవీ మాట్లాడుతూ.. పీవీ తన విద్వత్తోనే రాజకీయరంగంలో విజయం సాధించారని చెప్పారు. పీవీ ఖ్యాతిని ఈ తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు పీవీ మార్గదర్శిగా నిలుస్తారని పేర్కొన్నారు. పరిపాలన, సిద్ధాంతాల్లో విమర్శల్ని లెక్కచేయని వ్యక్తిత్వం పీవీ సొంతమని పీవీ కుమారుడు ప్రభాకర్రావు చెప్పారు. మారిషస్ సహా వివిధ దేశాల్లో పీవీ విగ్రహాల ఏర్పాటుకు కృషిచేస్తామని ఎన్నారై కన్వీనర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు.