Crocodile Attack | నదిలో నీళ్లు తాగుతున్న ఒక వ్యక్తిపై సడెన్గా దాడి చేసిన మొసలి అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాద్గిరి జిల్లాకు చెందిన వెంకటేశ్ (40) అనే రైతు.. కట్టెల కోసం కృష్ణానది సమీపంలో వెతుకుతున్నాడు. అతనితోపాటు మరికొందరు కూడా అక్కడ ఉన్నారు.
ఈ సమయంలో దాహం వేయడంతో నదిలో నీళ్లు తాగేందుకు వెంకటేశ్ వెళ్లాడు. నదిలో నీళ్లు తాగుతుండగా నీళ్లలోంచి అతనిపై మొసలి దాడి చేసింది. అతని కేకలు విని అక్కడకు చేరుకున్న స్థానికుల కళ్లముందే వెంకటేశ్ను నీళ్లలోకి లాక్కెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కలవాళ్లు వెంటనే పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న వాళ్లు వెంకటేశ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ చీకటి పడటంతో మరుసటి రోజుకు గాలింపును వాయిదా వేశారు. ఆ తర్వాతి రోజు ఉదయమే వెంకటేశ్ మృతదేహం నదిలో తేలుతూ కనిపించింది. పోస్టు మార్టం అనంతరం అంత్యక్రియల కోసం మృతదేహాన్ని వెంకటేశ్ కుటుంబ సభ్యులకు అధికారులు అందించారు.