న్యూఢిల్లీ: జైల్లో ఉన్న మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ త్వరలో బీజేపీలో చేరుతాడని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తనను మహా మోసగాడిగా పేర్కొంటూ సుకేష్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ‘నేరగాళ్లు, దొంగలు, డకాయిట్లు, మోసగాళ్ళు.. అందరూ బీజేపీలో చేరారు. జైలులో ఉన్న ఏ నేరస్థుడైనా ఎవరిపైన అయినా వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడతాడు. సుకేష్ చంద్రశేఖర్ అనే క్రిమినల్ మరికొద్ది వారాల్లో బీజేపీలో చేరుతాడు. ఈ విషయాన్ని ఇప్పుడు నేను వింటున్నాను’ అని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీని ఎదుర్కొలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్రం నియమించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కలిసి చేస్తున్న కల్పిత కుట్ర ఇదని ఆయన ఆరోపించారు.
కాగా, పలువురిని మోసగించడంతోపాటు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశాడు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి రూ.50 కోట్లు ఆప్ వసూలు చేసిదంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. తాను మోసగాడైతే, తన నుంచి రూ.50 కోట్లు వసూలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహా మోసగాడని అందులో ఆరోపించాడు.