Criminal Procedure (Identification) Bill | క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇది వ్యక్తిగత గోప్యతపై దాడి చేయడమేనని ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రతిపాదిత చట్టం కింద సేకరించే డేటాకు రక్షణ ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా నొక్కి చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరుల మానవ హక్కులను ఇది కాపాడుతుందని ప్రకటించారు. వివాదాస్పదంగా కనిపిస్తున్న ఈ బిల్లు చట్ట రూపం సంతరించుకుంటే.. వివిధ నేరాల దర్యాప్తులో భాగంగా ఖైదీలు, దోషుల ఫిజికల్ (భౌతిక), బయాలజికల్ (రక్త నమూనా)లను పోలీసులు సేకరించేందుకు అధికారం లభిస్తుంది.
ముసాయిదా బిల్లులో చేర్చిన విస్తృత నిబంధనల పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖైదీలు, ముందస్తు నిర్బంధంలో ఉన్న ఖైదీలపై చర్యలు తీసుకునేందుకు ఒక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, జైలు హెడ్ వార్డెన్లకు సాధికారత కల్పించడం ఆందోళన కరం అని స్పష్టం చేశారు.
క్రిమినల్స్, వివిధ కేసుల దర్యాప్తు పట్ల పోలీసులు, దర్యాప్తు అధికారులు అనుసరించాల్సిన విధి విధానాలపై మోదీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అమిత్షా చెప్పారు. ఫోరెన్సిక్ శిక్షణ కోసం ప్రత్యేకమైన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నదన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు.. పౌర హక్కులకు వ్యతిరేకంగా క్రూరమైన దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆరోపించారు. 1920-ఖైదీల గుర్తింపు చట్టం స్థానే ప్రతిపాదిస్తున్న బిల్లులో బ్రిటిష్ ప్రభుత్వం నాటి చట్టం కంటే తక్కువ రక్షణలు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా అన్నారు. నేరం రుజువు గానీ వ్యక్తి.. వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే అవకాశం ఉందన్నారు. ప్రజల నుంచి సేకరించిన డేటాకు రక్షణ చర్యల్లేవని చెప్పారు.
ఈ బిల్లు చట్టంగా మారితే భారత్ను పోలీసు రాజ్యంగా మారుస్తుందని బీఎస్పీ ఎంపీ దనీష్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు ఆయుధంగా మారుతుందన్నారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని విపక్ష సభ్యులు కోరారు.
ఈ బిల్లుపై సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలు, ఆందోళనకు కేంద్ర హోంమంత్రి అమిత్షా సమాధానం చెప్పారు. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రజల హక్కులను పరిరక్షిస్తుందని చెప్పారు. అందుకు అవసరమైన నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ చట్టం వినియోగాన్ని పరిమితం చేసేందుకు ఉత్తమ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులను నియమిస్తామన్నారు.ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే, ఖైదీలకు పునరావాసం, జన జీవన స్రవంతిలోకి ఖైదీలు, జైలు అధికారుల హక్కులపై పరిమితులు, క్రమశిక్షణ నిర్వహణ, జైళ్ల భద్రత, స్త్రీ, పురుషులకు వేర్వేరు జైళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.