కొప్పాల్, మే 16: సివిల్ కాంట్రాక్టుల్లో బీజేపీ నేతలు 40% కమీషన్ అడుగుతున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంట్రాక్టరు యెర్రిస్వామి కుంతోజీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీనే కేసు నమోదు కాగా తాజాగా ఆ విషయం బయటకు వచ్చింది. ఉపాధి హామీ పథకం కింద వ్యర్థాల తరలింపు కాంట్రాక్టును కుంతోజీ తీసుకొన్నారు. పనిని పూర్తి చేశారు. ఆయనకు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. అధికారులు రూ.4.8 లక్షలే చెల్లించారు. మిగతా బిల్లులు విడుదల కావాలంటే కాంట్రాక్టులో 40% కమీషన్ కావాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 3వ తేదీన కుంతోజీ మీడియా ముందుకు వచ్చారు.
బీజేపీ నేతల అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. అయితే, మూడు రోజుల తర్వాత మే 6న అనూహ్యంగా కుంతోజీపై కేసు నమోదైంది. కాంట్రాక్టు సూపర్వైజర్ విష్ణుకుమార్ నాయక్కు కుంతోజీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారని, ఇది నేరపూరిత విశ్వసనీయత ఉల్లంఘన(క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) కిందకు వస్తుందని కారాట్గి తాలూకా పంచాయతీ అధికారి మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తనపై కేసు నమోదయ్యాక కూడా కుంతోజీ అవినీతిపై తన పోరాటాన్ని ఆపలేదు. సీఎం బొమ్మైకి లేఖ రాశారు. కానీ, సీఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బిల్లులు చెల్లించాలని అడిగినందుకు కర్ణాటక బీజేపీ నేతలు కుంతోజీని బెదిరిస్తున్నారు.