పాట్నా : మద్య నిషేధం వల్లే బీహార్లో నేరాలు పెరిగిపోతున్నాయి అని బీజేపీ ఎమ్మెల్యే కుందన్ సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్ పోలీసులు మద్యం రవాణాపై దృష్టి సారించారు. కానీ హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, దొంగతనాలపై దృష్టి సారించలేదు. ఈ క్రమంలోనే నేరాలు ఘోరంగా పెరిగిపోతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆల్కహాల్ను స్వాధీనం చేసుకునేందుకు పెళ్లికూతురు గదిలోకి పోలీసులు ప్రవేశించడం దారుణమన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు.
మద్య నిషేధం నేపథ్యంలో కొందరు పిల్లల ద్వారా వారి బ్యాగుల్లో ఆల్కహాల్ను స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. పిల్లల జీవితాలతో బీహార్ ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లిక్కర్ మాఫియా గ్యాంగ్లు.. ఓటర్లకు బహిరంగంగానే మద్యం పంచుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమ మార్గాలను ఎంచుకోవడం సరికాదన్నారు. మనం ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.