న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు కేరాఫ్ అడ్రస్లా మారిపోయింది. గత కొన్నాళ్ల నుంచి అక్కడ వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రద్ధవాకర్ అనే యువతిని ఆమె ప్రియుడే హత్యచేసి 35 ముక్కలుగా కోసిన ఘటనను మరువకముందే, ఇటీవల నిక్కీ యాదవ్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేసే వ్యక్తే డాటా కేబుల్తో ఉరిబిగించి చంపేశాడు.
ఇవాళ చిన్న గొడవకే కొందరు వ్యక్తులు ఓ యువకుడిని నడిరోడ్డుపై పొడిచి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని నంగ్లోయ్ ఏరియాకు చెందిన విశాల్ మాలిక్ అనే యువకుడు ఇవాళ ఉదయం జిమ్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దారివెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి బైక్ తగిలింది. దాంతో స్థానికంగా ఉన్న ఓ పది మంది వ్యక్తులు కలిసి విశాల్పై దాడి చేశారు.
వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న విశాల్ మాలిక్.. బైక్ను మాత్రం అక్కడే వదిలేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి సాయం కోరాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో జరిగిన విషయం తన అన్న సాహిల్ మాలిక్ (25)కు చెప్పాడు. దాంతో బైక్ తెచ్చేందుకు వెళ్లిన సాహిల్ మాలిక్పై కూడా వాళ్లు దాడిచేశారు. అంతటితో ఆగక కత్తితో కడుపులో పొడిచి పారిపోయారు.
దాంతో సాహిల్ మాలిక్ అక్కడికక్కడే రోడ్డుపై కుప్పకూలాడు. ఈ ఘటనను చూసిన కొందరు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించే ప్రయత్నం చేస్తుండగానే రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. బాధిత యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాహిల్ను పొడిచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికి కోసం గాలిస్తున్నారు. కాగా, కత్తిపోటుకు గురైన సాహిల్ రోడ్డుపై విలవిల్లాడుతూ కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలున్నాయి..
The police have identified the arrested accused as Sunny, Deputy Commissioner of Police (DCP) (Outer) Harendra Kumar Singh told ANI.#NangloiRoadRage #Murder #Person #Delhi #Delhipolice #DelhiPoliceupdates #News #newsAlert #Newsupdate #TheFirstIndia pic.twitter.com/n20DFpAmYt
— First India (@thefirstindia) February 15, 2023