న్యూఢిల్లీ: కోవిషీల్డ్ టీకా డోసు గ్యాప్ను కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం కోవిషీల్డ్ టీకా తొలి డోస్, రెండో డోస్ మధ్య వ్యవధి 12-16 వారాలుగా ఉన్నది. అయితే దీనిని 8-16 వారాలకు సవరించారు. నీతి ఆయోగ్ సూచన మేరకు జాతీయ కోవిడ్ టీకా వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ టీకా వ్యవధిలో ఎలాంటి మార్పును నీతి ఆయోగ్ సూచించలేదు. ఈ టీకా తొలి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు వేస్తున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.
ప్రస్తుతం పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా టీకా అమలుపై శాస్త్రీయ ఆధారాల డేటా ఆధారంగా నీతి ఆయోగ్ ఈ సూచన చేసిందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. 8 వారాల గ్యాప్ తర్వాత కోవిషీల్డ్ టీకా రెండో డోసు ఇచ్చినప్పటికీ 12-16 వారాల గ్యాప్ మాదిరిగానే యాంటీబాడీల ప్రతిస్పందన ఉంటున్నదని పరిశోధనలో తేలిందన్నారు.
ఈ నేపథ్యంలో తొలి, రెండో డోసు మధ్య గ్యాప్ను తగ్గించడం వల్ల ఇంకా కోవిడ్ రెండో డోసు తీసుకోని సుమారు 6-7 కోట్ల మందికి రెండో డోసు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని నీతి ఆయోగ్ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే నీతి ఆయోగ్ సూచనను కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమలు చేయాల్సి ఉందన్నారు.
కాగా, నీతి ఆయోగ్ సిఫార్సుతో కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య గ్యాప్ను 6-8 వారాల నుంచి 12-16 వారాలకు గత ఏడాది మే 13న కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అయితే ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్పై ఆందోళన నేపథ్యంలో నీతి ఆయోగ్ సిఫార్సుతో రెండు డోసుల మధ్య గ్యాప్ను 8-16 వారాలకు మార్పు చేసింది.