న్యూఢిల్లీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు టీకా తయారీ సంస్థలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసింది. 18 ఏండ్లు దాటిన వారికి మాత్రమే విక్రయించేలా షరతులు విధించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్ అందించాలని, కొవిన్ వెబ్సైట్లో నమోదు చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రైవేటు దవాఖానల్లో విక్రయిస్తున్న ధర కన్నా తక్కువకే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కొవాగ్జిన్ను భారత్ బయోటెక్, కొవిషీల్డ్ను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తున్న విషయం తెలిసిందే.