Sowmya Swaminathan | మూడేండ్లుగా కరోనా ప్రభావాన్ని చూస్తున్నా.. దాని గురించి పూర్తిగా అర్థం కావడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్లు, కొత్తవేవ్లతో వివిధ ప్రాంతాల్లో ఎలా విరుచుకు పడుతున్నదో కూడా తెలియడం లేదన్నారు. ఇదిలా ఉంటే, ఈ మహమ్మారి ప్రభావంతో మున్ముందు దీర్ఘకాలంలో కనిపించే లాంగ్ కోవిడ్ దుష్ప్రభావాలు ఏమిటన్నది ఇంకా తెలియకపోవడం మరో ప్రమాదకర పరిణామం అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరోనా వేవ్లన్నింటికి కలిపి ఒక వ్యాక్సిన్ తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్పై తీవ్ర స్థాయిలో పరిశోధనలు జరుపుతున్నందున అన్ని వేరియంట్లకు ఒక వ్యాక్సిన్ రావడానికి రెండేండ్లు పడుతుందన్నారు.
బ్రిటిష్ మెడికల్ జర్నల్ నిర్వహించిన వర్చువల్ చర్చాగోష్టిలో సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా కరోనా మహమ్మారి ప్రవర్తిస్తున్నది. పెద్ద వయస్సు వారిలోనే వ్యాధి ప్రాబల్యం, మరణాల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నివేదికలు కూడా ఒకేలా లేవన్నారు. పలు దేశాల్లో పరీక్షా పద్దతులు, జన్యక్రమ విశ్లేషణ ఒకేలా లేవని, అందువల్లే కొత్తవేవ్లతో కొవిడ్ విజృంభించడానికి కారణాలను తెలుసుకోలేకపోతున్నట్లు చెప్పారు.
తీవ్రంగా కరోనా బారిన పడి కోలుకున్న బాధితుల్లో చాలాకాలం పలు లక్షణాలు వేధిస్తున్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. కొవిడ్ రోగులకు మధుమేహం, హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. దీనివల్ల వైరస్తో ఏదో జరుగుతున్నదని అర్థమవుతున్నదని అన్నారు. కోవిడ్ దీర్ఘ కాలిక ప్రభావం కేవలం శ్వాసకోశ మార్గాలను మాత్రమే కాక శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తున్నదన్నారు. ఇతర శ్వాసకోస వైరస్లతో పోలిస్తే కరోనా వైరస్ విభిన్నమనే విషయం సుస్పష్టం అని అన్నారు.