హైదరాబాద్: కరోనా వైరస్ టీకాలను దేశ ప్రజలందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా టీకా దేశానికి అవసరం అని, సురక్షితమైన జీవనం ప్రతి ఒక్కరి హక్కు అని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం తమ గొంతు వినిపించాలని తన ట్వీట్లో రాహుల్ కోరారు. స్పీక్ అప్ ఫర్ వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ అన్న హ్యాష్ ట్యాగ్తో కూడా ఆయన ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి టీకా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ తన వీడియోలో కోరారు. ఇవాళ దేశవ్యాప్తంగా 1.68 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. టీకా తీసుకున్న వారి సంఖ్య ఇప్పటికే పది కోట్లు దాటింది.