న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) ప్రక్రియ మొదలై ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు 158.16 కోట్ల వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 158,16,75,635 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం కేంద్ర సమకూర్చిన వాటిలో 13.25 కోట్ల డోసులు (13 కోట్ల 25 లక్షల 29 వేల 901 డోసులు) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద వినియోగించడానికి అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 2021, జనవరి 16న ప్రారంభమైంది. ఇప్పటివరకు అర్హులైన వారికి 158.04 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇటీవలే 15-18 ఏండ్ల మధ్య వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.