న్యూఢిల్లీ: దేశంలో కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎమ్మార్ (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ మూడో వేవ్ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తన నివేదికలో పేర్కొంది. రాబోయే కరోనా వేవ్స్ను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ దోహదపడుతుందని తెలిపింది.
ఐసీఎమ్మార్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్య నిపుణులు సందీప్ మండల్, సమీరన్ పండా, లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కు చెందిన నిమలన్ అరినమిన్పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయన పత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్లో ప్రచురితమైంది. రోగనిరోధక శక్తి క్షీణించడం, రోగనిరోధక శక్తిని ఎదురించేలా వైరస్లో మార్పులు రావడం మూడో వేవ్కు దారితీసే అవకాశాలు తక్కువేనని నివేదికలో అభిప్రాయపడ్డారు.
రెండు సందర్భాల్లోనే మూడో వేవ్ తలెత్తడానికి ఆవకాశం ఉన్నదని ఐసీఎమ్మార్ నివేదిక పేర్కొన్నది. అందులో మొదటి సందర్భం.. కొత్త వేరియంట్కు అధిక సంక్రమణ శక్తి ఉండటం, అదే సమయంలో అది రోగనిరోధక శక్తిని తట్టుకుని నిలువగలగడం. రెండో సందర్భం.. సంక్రమణను తగ్గించగలిగే లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయడం. ఈ రెండు కారణాలవల్ల ఒకవేళ మూడో వేవ్ వచ్చినప్పటికీ అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అధ్యయన పత్రంలో అభిప్రాయపడ్డారు.