న్యూఢిల్లీ, మే 20: దేశంలో కరోనా సెకండ్వేవ్ జూలై చివరి కల్లా పూర్తిగా తగ్గుతుందని భారత శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ) కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడు, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. ఈ నెల చివరికి రోజువారీ కేసులు 1.5 లక్షలకు పడిపోతాయని, జూలై చివరికి రోజుకు 20వేల దిగువకు చేరుతాయని చెప్పారు. సెకండ్ వేవ్ తగ్గిన 6-8 నెలల్లో మూడో వేవ్ రావొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందని చెప్పారు. దాని ప్రభావం కూడా తక్కువేనన్నారు. అప్పటివరకు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకోవడం, ప్రజల్లో కరోనాకు ఇమ్యూనిటీ పెరగడమే ఇందుకు కారణం అన్నారు. వ్యాక్సినేషన్ వేగం పెంచి, కొవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో వేవ్ ముప్పును తప్పించుకోవచ్చని ఇదే బృందంలో ఉన్న మరో శాస్త్రవేత్త విద్యాసాగర్ అన్నారు.
‘సూత్ర’ అనే ప్రత్యేక గణిత పద్ధతిని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. గతంలో కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్రాఘవన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మూడో వేవ్ తప్పదని హెచ్చరించారు.