న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ( Covid effect ) వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన ఏడెనిమిది గంటల్లోనే అక్కడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా 11 వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. వీకెండ్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ యంత్రాంగం కూడా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కొవిడ్ విస్తృతి కారణంగా పేషెంట్ల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో శీతాకాల సెలవుల్లో ఉన్న సిబ్బందికి మిగతా సెలవులను రద్దు చేసి తక్షణమే విధులకు హాజరుకావాలని ఓ ప్రకటనలో ఆదేశించింది.
ఎయిమ్స్ సిబ్బంది శీతాకాల సెలవులు ఈ నెల 10 ముగియనున్నాయి. కానీ, ఆస్పత్రి యంత్రాంగం సెలవులను రద్దు చేయడంతో వారు రేపటి నుంచి తప్పక హాజరుకావాల్సి వచ్చింది. అంటే వారి ఆరు రోజుల సెలవులు రద్దయ్యాయి. ఇదిలావుంటే కొవిడ్ విస్తృతి నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.