న్యూఢిల్లీ: దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
ఇటీవలి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉన్నదని, ఇప్పుడు శీతాకాలం కావడంతో ఇన్ప్లూయెంజా లాంటి వైరస్ల కారణంగా కేసుల సంఖ్యలో పెంపు కనిపిస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జూలైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇవాళ అధికంగా 166 కేసుల నమోదు కావడం గమనార్హం. కాగా, కరోనా మహమ్మారి దేశంలో కాలు మోపినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 5,33,306కు పెరిగింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య శాఖ డాటా ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కరోనా టీకాలు వేశారు.