ముంబై: మహారాష్ట్రలో ఒకవైపు పండుగల సీజన్ మొదలైంది. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Uddav Thackeray ) ఆ రాష్ట్ర ప్రజలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. కరోనా థర్డ్వేవ్ వాకిళ్లలోనే పొంచి ఉన్నదని, కావాలంటే పండుగలు తర్వాత చేసుకోవచ్చని, ఇప్పుడు గుంపులుగా చేరి పండుగలు చేసుకోవడం ప్రమాదకరమని ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. కరోనాను నిలువరించేందుకు రాజకీయ పార్టీలు కూడా నిరసన ప్రదర్శనలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు.
మనం కావాలంటే పండుగలు తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాధాన్యం ఇవ్వాల్సింది ప్రజల జీవితాలు, ఆరోగ్యాలకు. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నది అని ఉద్ధవ్ ఆందోళన వ్యక్తంచేశారు. పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించడాన్ని ఎవరు మాత్రం ఇష్టపడుతారు. కానీ, ప్రజల జీవితాలు ముఖ్యం కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కరోనా థర్డ్వేవ్ మన వాళ్లలోనే పొంచి ఉన్నది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. కేరళలో ప్రస్తుతం రోజుకు 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మనం కూడా కరోనా నిబంధనలను గాలికి వదిలేసి పండుగలు జరుపుకుంటే కేరళలో కంటే ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఉద్ధవ్ థాకరే అభిప్రాయపడ్డారు.