భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ కాన్పూర్ చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. రాబోయే జూన్ 22 పరిసర ప్రాంతంలో భారత్లో కరోనా నాలుగో వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆగస్టు చివరి నాటికి ఇది పీక్ స్థాయికి చేరుతుందని ఈ స్టడీ వెల్లడించింది.
అయితే ఏదైనా కొత్త కరోనా వేరియంట్ బయటపడితే ఈ అంచనాలు మారే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొత్తగా వచ్చే వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? ఎంత ప్రమాదకరం? అనే అంశాలు ఈ పరిశోధనను ప్రభావితం చేస్తాయని వారు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత జనవరిలో కరోనా తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతిరోజూ దేశంలో లక్షపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత పరిస్థితి నెమ్మదిగా తగ్గుముఖం పట్టుంది. ఇప్పుడు 20 రోజుల నుంచి లక్షలోపు కేసులే నమోదవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 20 వేల లోపే ఉంటోంది. అయితే అప్పుడే కరోనా పూర్తిగా అంతం కాలేదని, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే.