Covid 19 | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆసియా ఆదేశాల్లో (హాంకాంగ్-సింగపూర్) పెరుగుతున్న కరోనా కేసులు ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనను రేకెత్తించాయి. గత కొన్ని వారాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడమే కాకుండా చాలాచోట్ల ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరిగింది. ఈ పెరుగుతున్న కేసులకు కొత్త వేరియంట్ కారణమని ఇప్పటి వరకు నిపుణులు ప్రకటించలేదు. అయితే, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా వైరస్ ప్రభావం మరోసారి కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా రక్షణ ఉంటుందన్నారు.
గతంలో ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పలు ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాలలో కోవిడ్-19 కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ మరోసారి వినాశనం కలిగించబోతోందా? కోవిడ్-19 నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనమందరం మునుపటిలాగే చర్యలు తీసుకోవాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. హాంకాంగ్, సింగపూర్ వంటి నగరాల్లో ఆసుపత్రిలో చేరడం, మరణాలతో పాటు కొత్త కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు సంవత్సరం తర్వాత తొలిసారిగా కేసులు పెరుగుతున్నాయి. అనేక దేశాలలో పెరుగుతున్న ప్రమాదాలను చూసి, ఆరోగ్య సంస్థలు ప్రజలను అప్రమత్తం చేశాయి. మరో వైపు పెరుగుతున్న ముప్పు మధ్య యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నోవావాక్స్ కొత్త వ్యాక్సిన్ను ఆమోదించింది.
అమెరికాకు చెందిన నెబ్రాస్కా మెడిసిన్లో అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మార్క్ ఈ రూప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎల్పీ.8.1 వేరియంట్ ద్వారా కేసులు పెరుగుతున్నాయన్నారు. 70శాతం కేసులకు ఈ వేరియంట్ కారణమని.. 9శాతం కేసులకు ఎక్స్ఎఫ్సీ వేరియంట్ కారహన్నారు. ఒమిక్రాన్ అసలు వేరియంట్ ప్రస్తుతం కనుమరుగైందని.. ప్రస్తుతం సబ్ వేరియంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమేమీ కాదని.. కాలక్రమేణా ప్రజల రోగనిరోధక శక్తి బలహీనపడడం వల్ల వైరస్ మరింత సులభంగా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో ఎల్పీ.8.1 వేరియంట్ కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ కేసులు పెరిగాయి. యూకే, ఆస్ట్రేలియా సహా అనేక ప్రాంతాల్లో ఈ వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొన్నారు. జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎల్పీ.8.1 వేరియంట్ని.. అండర్ మానిటరింగ్ వేరియంట్గా పేర్కొంది.