న్యూఢిల్లీ, అక్టోబర్ 13: కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించరాదన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులిచ్చారు. హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించటంపై పలువురు విద్యార్థులు, సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీటినిని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం విచారించి గురువారం తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు తీర్పును హేమంత్ గుప్తా సమర్థించి పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. ధులియా మాత్రం హిజాబ్ ధరించటం అనేది ఆయా వ్యక్తుల ఇష్టానికి సంబంధించిన విషయమని, దీనిపై ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకురాలేవని తీర్పునిచ్చారు. దీంతో ఈ విషయాన్ని తేల్చేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థలో అసంబద్ధమైనదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దిన్ ఒవైసీ అన్నారు. ఖురాన్లోని బోధనలను హైకోర్టు తీర్పులో వక్రీకరించారని విమర్శించారు. బాలికల భవిష్యత్తు కోసం సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
హిజాబ్ వివాదంపై విచారణను విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేయటంతో.. దీనిపై తదుపరి విచారణకు ఐదుగురు న్యాయమూర్తులకు తగ్గకుండా ఉండే ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ (ఏఐబీఏ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్కు విజ్ఞప్తి చేసింది. ధర్మాసనంలో ఒక ముస్లిం న్యాయమూర్తి కూడా ఉండేలా చూడాలని సీజేఐకి గురువారం రాసిన లేఖలో ఏఐబీఏ చైర్మన్ ఆదిశ్ సి అగర్వాల్ కోరారు.
సుప్రీంకోరు భిన్న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ను నిషేధించిన తమ ప్రభుత్వ నిర్ణయం కొనసాగుతుందని కర్ణాటక మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయలేదని పేర్కొన్నారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో తమ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇస్తుందని ఆశించామని, కానీ అందుకు భిన్నమైన తీర్పు వచ్చిందని తెలిపారు.
విద్యా సం స్థల్లో హిజాబ్ ధరించటాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 5న జారీచేసిన ఆదేశాలు చట్ట వ్యతిరేకమని జస్టిస్ ధులియా తన తీర్పులో తెలిపారు. రాజ్యాంగం ప్రసాధించిన సమానత్వం, సమగ్రత సూత్రాలకు సర్కారు నిర్ణయం భంగం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ‘దేశంలోని గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో బాలికలు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు వారిని మరింత వెనుకబాటుకు గురిచేస్తాయి. బాలికలు ఉత్తమంగా జీవించేందుకు మనం కృషిచేయాలి. పాఠశాల గేటు వద్ద విద్యార్థినిని ఆపి తల ముసుగు తొలగించాలని ఆదేశించటం.. వారి గోప్యతపై దురాక్రమణ చేయటమే. వారి గౌరవ మర్యాదలపై దాడి చేయటమే. అంతిమంగా వారికి లౌకిక విద్యను నిరాకరించటమే’ అని పేర్కొన్నారు.
హిజాబ్ ధరించటం ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని జస్టిస్ హేమంత్ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. ఈ అంశంపై 11 ప్రశ్నలు సంధించి, వాటికి ఆయనే సమాధానాలు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కు పరిధిలోకి హిజాబ్ రాదని తెలిపారు. ఆర్టికల్ 19 (1)(ఏ) ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 21లో పొందుపర్చిన గోప్యత హక్కులు వేటికవే ప్రత్యేకమైనవని, వాటి పరిధిలోకి హిజాబ్ అంశం రాదని స్పష్టంచేశారు. ‘మత సంబంధమైన గుర్తులు, వస్ర్తాలను ధరించిన విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించటం అంటే భారత రాజ్యాంగంలో పేర్కొన్న సోదరభావాన్ని ధ్వంసం చేయటమే. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నది’ అని స్పష్టంచేశారు.