న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శనివారం హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుడు పుష్పా సినిమా తరహాలో ‘తగ్గేదేలే’ స్టైల్లో మీడియాకు పోజిచ్చాడు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 14 మందిని రోషిణి కోర్టులో ఆదివారం హాజరుపర్చారు. ఇద్దరు ప్రధాన నిందితులు అన్సార్, అస్లామ్లను ఒక రోజు పోలీస్ కస్టడీకి కోర్టు పంపింది. మిగతా 12 మంది నిందితులకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు న్యాయవాది వికాస్ వర్మ తెలిపారు.
కాగా, ప్రధాన నిందితులు అన్సార్, అస్లాంలకు శోభా యాత్ర గురించి ఏప్రిల్ 15న తెలిసిందని, దీంతో వారు ఈ కుట్రకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 16న అరెస్టైన నిందితులపై 147,148,149,186,353,332,323,427, 436,307,120బీ ఐపీసీ సెక్షన్లతోపాటు ఆయుధ చట్టంలోని 27 సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ నార్త్-వెస్ట్ డీసీపీ ఉషా రంగాని తెలిపారు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారు. మూడు తుపాకులు, ఐదు కత్తులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మిగతా నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు హనుమాన్ జయంతి హింసాత్మక ఘటనల నేపథ్యంలో జహంగీర్పురిలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే డ్రోన్ల ద్వారా భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సమీపంలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ముందస్తుగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు.
#WATCH | Accused in Jahangirpuri violence case being taken to Rohini court pic.twitter.com/UZZPobYZ4n
— ANI (@ANI) April 17, 2022