ముంబై: మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘తొందరపాటు అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుంది’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డిప్యూటీ స్పీకర్ పంపిన అనర్హత నోటీసులపై జూలై 11 వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని సోమవారం తెలిపింది. ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుపై జులై 11 సాయంత్రం 5.30 గంటల వరకు సమాధానం ఇచ్చేందుకు సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై ఐదు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు, శాసనసభా పక్ష నేత అనిల్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ అఫిడవిట్లపై షిండే వర్గం మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది.
మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ గ్రూప్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ను సుప్రీంకోర్టు కోరింది. అయితే రెబల్ బృందం అవిశ్వాస తీర్మానాన్ని ఈమెయిల్ ద్వారా పంపారని డిప్యూటీ స్పీకర్ తరుఫు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టుకు తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలోని అన్ని రికార్డులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, 39 మంది రెబల్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెబల్ ఎమ్మెల్యేలకు, వారి ఆస్తులకు ఎలాంటి హాని జరుగబోదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ న్యాయవాది చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసింది. తదుపరి విచారణను జూలై 11కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.