చెన్నై: కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఒక జంట,పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. అయితే మూడు రోజులకే ఆ జంట హత్యకు గురైంది. (Couple’s Murder) కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 24 ఏళ్ల మరి సెల్వం, 20 ఏళ్ల కార్తీక రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అక్టోబర్ 31న తమ ఇళ్ల నుంచి పారిపోయిన వారిద్దరూ కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం మురుగేషన్ నగర్లోని ఒక ఇంట్లో ఉంటున్నారు.
కాగా, ఈ నెల 2న గురువారం సాయంత్రం ఆరు గంటలకు సుమారు ఆరు మంది వ్యక్తులు బైకులపై ఆ జంట ఇంటికి వచ్చారు. కుటుంబాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న వారిద్దరిని కత్తులతో నరికి చంపి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ జంట మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువ జంట హత్య కేసు దర్యాప్తు కోసం మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.