Supreme Court | మాజీ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు వ్యతిరేకంగా వైద్యుడు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో సదరు వైద్యుడు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ ప్రసన్న భావల్చంద్ర వరాలే ధర్మాసనం పేర్కొంది. చండీగఢ్కు చెందిన డాక్టర్ మోహిత్ ధావన్ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషనర్, సీబీఐ వద్ద చాలాకాలంగా ఫిర్యాదు పెండింగ్లో ఉందని.. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 15, 2021న పిటిషన్ తిరస్కరించింది. ఈ కేసులో పిటిషనర్కు హైకోర్టు రూ.20వేల జరిమానా విధించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019లో సీబీఐ డైరెక్టర్కు అస్థానాపై ఫిర్యాదు చేశానని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.