న్యూఢిల్లీ: అమెజాన్తో న్యాయ పోరాటం నేపథ్యంలో కిశోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ రిటైల్ గ్రూప్కు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లైఫ్లైన్ ఇచ్చింది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం అమలు సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ శుక్రవారం ప్రకటించింది. ఇంతకుముందు రిలయన్స్ రిటైల్లో విలీనం కోసం చేసుకున్న ఒప్పందం అమలు చేయడానికి ఫ్యూచర్ రిటైల్ గ్రూప్కు గత నెలాఖరు వరకు పొడిగించింది.
తాజాగా అమెజాన్తో న్యాయ వివాదం నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఫ్యూచర్ రిటైల్కు మరో ఆరు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు ఫ్యూచర్ రిటైల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకునేందుకు వెసులుబాటు లభించినట్లయింది.
ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు ఉంటుంది.
ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్కు వాటాలు ఉన్నాయి. దీంతో ఫ్యూచర్ రిటైల్ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్కు దఖలు పడినట్లయింది. అందుకే రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందం అమలు విషయమై వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో ఫ్యూచర్-రిలయన్స్-అమెజాన్ సంస్థల మధ్య గల వివాదం ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీంతో ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ గడువును పొడిగించక తప్పలేదు.
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం