హరిద్వార్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కుంభమేళాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. హరిద్వార్లో గత నాలుగు రోజుల్లో 300కుపైగా కరోనా కేసులు నమోదైనట్లు కుంభమేళా ఆరోగ్య అధికారి తెలిపారు. శంకరాచార్య చౌక్లోని కృష్ణ ఆశ్రమంలో ఏడుగురు సాధువులకు కరోనా సోకినట్లు చెప్పారు. దీంతో ఆశ్రమంలోని మిగతా సాధువులను ఐసొలేషన్లో ఉంచారు. కరోనా కేసుల తీవ్రత పెరిగితే నెల రోజులపాటు సాగే కుంభమేళాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు కరోనాను నియంత్రించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కుంభమేళాలో పాల్గొనే భక్తులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నెగిటివ్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. కాగా, ఈ నెల 12, 14, 27 తేదీల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించనుండటంతో కరోనా వ్యాప్తిపై మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది.