న్యూఢిల్లీ, జనవరి 24: కొవిడ్ మహమ్మారి ఎండెమిక్ దశ వైపుగా సాగుతున్నదని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత కొవిడ్ వ్యాక్సినేషన్ స్థితి, సహజ ఇన్ఫెక్షన్ను పరిశీలిస్తే, త్వరలోనే మనలో మెజార్టీ మందికి కరోనా సోకుతుందని, ఆపై ఇది ఎండెమిక్ వైరస్గా మారుతుందని అంచనా వేశారు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికే కేసులు పరిమితం కావడం, ఆ ప్రాంతంలో కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉండడాన్ని ఎండెమిక్ దశగా భావిస్తారు. ఒమిక్రాన్ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా హెచ్చరించారు. కరోనా మూడో దశలో ఎక్కువ మంది చిన్నారులు వైరస్ బారిన పడుతున్నారని, ఒమిక్రాన్ పిల్లలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు.
యాంటిబాడీ థెరపీ అశాస్త్రీయం: గగన్దీప్ కాంగ్
కొవిడ్ యాంటిబాడీ థెరపీ అనైతికం, అశాస్త్రీయం అని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ గగన్దీప్ కాంగ్ అన్నారు. కొవిడ్ రోగుల్లో ఒమిక్రాన్ వేరియంట్ చికిత్స కోసం దేశంలోని ప్రైవేటు దవాఖానల్లో వైద్యులు మోనోక్లోనల్ యాంటిబాడీ థెరపీని సూచిస్తుండటంపై అమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో లైసెన్స్ పొందిన మోనోక్లోనల్ యాంటిబాడీ థెరపీ ఉత్పత్తులు ఒమిక్రాన్ను నిలువరించలేవన్న విషయం తెలిసిందేనన్నారు. కరోనా చికిత్స ప్రొటోకాల్ నుంచి మోనోక్లోనల్ యాంటిబాడీ ట్రీట్మెంట్ను మినహాయించారు.
టీకా తీసుకోనివారికి ప్రవేశం లేదు
కరోనా మహమ్మారి దృష్ట్యా రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాలపై కేంద్రం పలు నిబంధనలను జారీచేసింది. కరోనా టీకాలు తీసుకోనివారికి, 15 ఏండ్ల లోపు పిల్లలకూ పరేడ్ కార్యక్రమం గ్యాలరీల్లోకి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. పరేడ్కు వచ్చేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని, టీకా సర్టిఫికెట్లు వెంట తెట్టుకోవాలని సూచించారు.
ఒక్కరోజులో 3.06 లక్షల కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 3,06,064 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 20.75 శాతంగా రికార్డయింది. మే తర్వాత ఈ స్థాయిలో పాజిటివిటీ పెరుగడం ఇదే తొలిసారి. ప్రతి ఐదుగురిలో ఒక్కరికి పాజిటివ్గా నమోదవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్యూరిఫయర్ మాస్క్.. ధర 6,850
బట్టలు తొడుక్కొన్నట్టే, మాస్క్ ధరించటం కూడా మన శరీరంలో భాగమైపోయింది. బట్టల్లో బ్రాండ్ చూస్తున్నట్టే.. ఇప్పుడు మాస్కుల్లోనూ బ్రాండ్ చూస్తున్నారు. అలాంటివారి కోసం ఫిలిఫ్స్ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన మాస్కులను రూపొందించింది. ఆ మాస్కులు గాలిని కూడా శుద్ధి చేయగలవు. దానికోసం ఆ మాస్కులోనే ఓ బ్యాటరీ, యూఎస్బీ, ఫ్యాన్, బిల్ట్ ఇన్ ప్యూరిఫయర్ ఉంటాయి. సాధారణ మాస్కుల వల్ల కొందరికి శ్వాస సంబంధ సమస్యలు వస్తున్న తరుణంలో వారికోసం వీటిని తయారుచేసిందీ కంపెనీ. ధరను బట్టి మాస్కుల్లో ప్రత్యేకతలను జోడించింది. రూ.400 మొదలుకొని, రూ.6,850 వరకు లభిస్తున్నాయి. అత్యధిక ధర ఉన్న మాస్కులు గాలిని 4 దశల్లో శుద్ధి చేస్తాయి. ఈ మాస్కులు అమెజాన్ వంటి ఈకామర్స్ వెబ్సైట్లలో దొరుకుతున్నాయి.