అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన ఒక రోజులోనే పంజాబ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. పంజాబ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్. కరుణ రాజుకు కరోనా సోకింది.
ఈ విషయాన్ని ఆదివారం నాడు ధ్రువీకరించిన ఆయన.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను శనివారం నాడు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఆ మరుసటి రోజే పంజాబ్ సీఈవో (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్)కు కరోనా సోకడం గమనార్హం. పంజాబ్లో ఒక దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టిపోటీ నెలకొంది.