రెంజల్, మే 1: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు కొవిడ్ పేషెంట్లకు సకాలంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇప్పించి వారి కుటుంబాల్లో భరోసా నింపారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఖాజాఖాన్ భార్య హతియాబేగం, కూతురు మునీరా కౌసర్ కొవిడ్ బారినపడి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన లో చేరారు. ఇద్దరికీ పల్స్రేట్ పడిపోవడంతో రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలని కుటుంబీకులకు వైద్యులు సూచించారు. మార్కెట్లో కొరత, ప్రైవేట్లో అధిక రేటు కారణంగా ఇంజక్షన్లు కొనలేని దీనస్థితి తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వికార్పాషా.. శనివారం ఎమ్మెల్సీ కవితకు ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. తక్షణమే స్పందించిన ఆమె.. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి గంటలోపే ఇంజక్షన్లను ఉచితంగా ఇప్పించారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవితకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.