58 మంది మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. బుధవారం ఒకేరోజు 7,994 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ ఉద్ధృతి మరింత పెరుగుతున్నది. గ్రేటర్లో ఏకంగా 1,630 కేసులు నమోదైనట్టు గురువారం విడుదలచేసిన బులిటెన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరిలో 615, రంగారెడ్డిలో 558, నల్లగొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్లో 301 కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో 58 మంది మరణించారు. బుధవారం రికార్డుస్థాయిలో 4,009 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 81.71 శాతం ఉండగా, జాతీయ సగటు 82.1 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారంనాటికి 25,742 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అందులో ప్రభుత్వ దవాఖానల్లో 7,610, ప్రైవేటులో 18,132 పడకలు అందుబాటులో ఉన్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గురువారం ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్కు వెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని చాడ చెప్పారు.
45 లక్షలు దాటిన వ్యాక్సినేషన్
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. బుధవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికిపైగా టీకాలు తీసుకున్నారు. ఇందులో 39.5 లక్షల మంది మొదటి డోస్, 5.78 లక్షల మంది రెండో డోస్ వేసుకున్నారు. బుధవారం రాష్ట్రంలో 1.38 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.09 లక్షల మంది మొదటి డోస్, 29 వేలమంది రెండో డోస్ తీసుకున్నారు.