Coromandel Express | బాలాసోర్, జూన్ 2: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో 70 మందికి పైగా ప్రయాణికులు మరణించగా 350 మందికి పైగా గాయపడ్డారు. గత దశాబ్ద కాలంలో సంభవించిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటైన ఈ దుర్ఘటన శుక్రవారం బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో సంభవించింది. బెంగాల్లోని షాలీమార్ – చెన్నై సెంట్రల్ మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొని పట్టాలు తప్పింది. ఈ రైలు బోగీలు పక్కనే మరో ట్రాక్పై పడిపోయాయి. అదే సమయంలో అటువైపు నుంచి వచ్చిన బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది.
ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మరణించి ఉండవచ్చని స్థానికుల చెప్తుండగా అధికారులు 70 మంది మృతులను నిర్ధారించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన 350 మందిని బాలాసోర్ వైద్య కళాశాల సహా సమీపంలోని దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వ సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే రాత్రి సమయం కావడంతో వెలుతురు లేమి కారణంగా సహాయక చర్యలకు కొంత అంతరాయం కలుగుతున్నది. చాలా మంది ప్రయాణికులు రైలుబోగీల కింద చిక్కుకున్నారని, కొందరిని స్థానికుల సాయంతో బయటకు తీశామని అధికారులు తెలిపారు.
రైల్వే అధికారి అమితాబ్ శర్మ ప్రకటన ప్రకారం ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొని పట్టాలు తప్పడంతో 10-12 బోగీలు పక్కనున్న ట్రాక్పై పడ్డాయి. ఆ తర్వాత కొంత సేపటికి కోరమాండల్ బోగీలు పడిన ట్రాక్పైకి వచ్చిన యశ్వంత్పూర్-హౌరా రైలు ఈ బోగీలను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో యశ్వంత్పూర్-హౌరా రైలు బోగీలు 3-4 పట్టాలు తప్పాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేయగా, సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం అందించేందుకు తమ రాష్ట్ర మంత్రి నేతృత్వంలో ఒక బృందాన్ని ఘటనా స్థలికి పంపుతున్నట్టు మమత వెల్లడించారు.
తమిళనాడు నుంచి నలుగురు మంత్రులతో కూడిన బృందాన్ని పంపుతున్నట్టు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ వెల్లడించారు. రైలు ప్రమాదానికి సంబంధించి 033- 22143526/ 22535185 నెంబర్లతో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మమత తెలిపారు. రైల్వే శాఖ కూడా 033-2638227 (హౌరా), 8972073925 (ఖరగ్పూర్), 8249591559 (బాలాసోర్) నెంబర్లతో హెల్ప్ లైన్లను ఏర్పాటుచేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన అని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటం, మరెందరో తీవ్రంగా గాయపడటం పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తగిన రీతిలో ఆదుకొని, వారికి భరోసా కల్పించాలని కోరారు.