న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆఫ్తాబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధాను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో, సమీపంలోని ఫారెస్టులో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆమె శరీర భాగాలను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఆమె తలను ఢిల్లీకి సమీపంలోని మెహ్రౌలీ వద్ద ఉన్న చెరువులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ చెరువులో ఉన్న నీటిని తోడేస్తున్నారు పోలీసులు.
అక్టోబర్ 18వ తేదీన ఆఫ్తాబ్ ఓ బ్యాగ్తో వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. గర్ల్ఫ్రెండ్ శ్రద్ధా శరీర భాగాలను పడేసేందుకు అతను ఆ బ్యాగ్ను వాడినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ వేసుకుని మూడుసార్లు రౌండ్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు.
శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాల కోసం మెహ్రౌలీ అడవిలో వరుసగా ఆరో రోజు పోలీసులు వెతికారు. మర్డర్ జరిగిన రోజున తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. నిందితుడు మారిజోనా తీసుకునేవాడని విచారణలో తెలిసింది. ఈ కేసులో విచారణ కోసం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పోలీసులు వెళ్లారు.
స్నేహితులు, ఆఫీసు సహోద్యోగులతో శ్రద్ధా చేసిన వాట్సాప్ చాటింగ్కు చెందిన స్క్రీన్షాట్లు బయటకు వచ్చాయి. అయితే శ్రద్ధాను ఆఫ్తాబ్ చాలా హింసించినట్లు ఆ చాటింగ్ ద్వారా తెలుస్తోంది. శ్రద్ధా ముఖానికి, మెడకు గాయాలైన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.