లక్నో: భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిరాజ్ యుద్ధ విమానం టైర్ చోరీ అయ్యింది. పోలీసులు చివరకు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 27న లక్నోలోని షాహీద్ మార్గంలో కదులుతున్న లారీ నుంచి ఐఏఎఫ్ మిరాజ్ ఫైటర్ జెట్ టైర్ చోరీకి గురైంది. లక్నోలోని బక్షి కా తలాబ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్బేస్కు మిరాజ్ జెట్ టైర్లతోపాటు ఇతర రక్షణ సామగ్రిని రవాణా చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
లారీ నుంచి టైర్ను లాగి ద్విచక్ర వాహనంలో ఇద్దరు తీసుకెళ్లడాన్ని చూసిన ఒక వాహనదారుడు ఈ విషయాన్ని లారీ డ్రైవర్ హేమ్ సింగ్ రావత్కు చెప్పాడు. దీంతో మిరాజ్ జెట్ టైర్ చోరీపై లక్నో పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. ట్రాఫిక్ జామ్ సందర్భంగా లారీ ఆగినప్పుడు ఈ చోరీ జరిగినట్లు చెప్పాడు. కేసు నమోదు చేసిన లక్నో పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ నెల 4న బక్షి కి తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు ఇద్దరు వ్యక్తులు మిరాజ్ జెట్ టైర్తో వచ్చారని పోలీసులు తెలిపారు. చోరీ అయిన ప్రాంతంలోని రోడ్డుపై ఆ టైర్ తమకు కనిపించినట్లు చెప్పారన్నారు. లారీ టైర్గా భావించి తమ ఇంటికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారని అన్నారు. దీంతో మిరాజ్ జెట్ టైర్ను స్వాధీనం చేసుకున్నట్లు లక్నో పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.