Chhattisgarh : చత్తీస్గఢ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు దిగగా.. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ప్రాంతం, ఖాపర్గంజ్ ప్రాంతంలోని సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తుల మధ్య పాత తగాదాలున్నాయి.
దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఘర్షణ సందర్భంగా ఒక వ్యక్తి మరో వ్యక్తిని రాయితో కొట్టాడు. గాయపడ్డ వ్యక్తి తన వారిని పిలిచాడు. వారు వచ్చి, ఎదుటి వ్యక్తిపై దాడికి యత్నించారు. దీంతో ఇద్దరివైపు నుంచి పలువురు ఈ ఘర్షణలో చేరారు. ఇలా ఇద్దరి మధ్య మొదలైన గొడవ.. రెండు వేర్వేరు వర్గాల మధ్య గొడవగా మారింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. వారిపై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. రాళ్ల దాడి చేయడంతో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. అయితే, పోలీసుల లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్తితి ప్రశాంతంగానే ఉందని బిలాస్పూర్ సీనియర్ ఎస్పీ రజ్నేష్ సింగ్ తెలిపారు. ఈ ఘటన కారణంగా అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించినట్లు చెప్పారు.
మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా ఈ ప్రాంతంలో సెక్షన్ 163 విధించామని ఎస్పీ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర విభాగాలకు చెందిన 500 మంది భద్రతా సిబ్బందిని మోహరించామని వివరించారు. ఇరువర్గాల్లో దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.