శ్రీనగర్: ఉగ్రవాదిగా పొరపడిన సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరుపడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. జమ్ముకశ్మీర్లోని ఒక ఆలయం వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా ఉంటారు. కాగా, లంగాటే హంద్వారాలో నివాసం ఉండే పోలీస్ కానిస్టేబుల్ అజయ్ ధర్ గత రాత్రి స్థానిక ఆలయం వద్దకు వచ్చాడు. మూసి ఉన్న బయటి గేట్ను గట్టిగా బాదాడు. దీంతో ఆలయం లోపల ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యి గాల్లోకి కాల్పులు జరిపారు.
అయితే కానిస్టేబుల్ అజయ్ తన ఐడెంటీని చెప్పకుండా డోర్ను పదే పదే బాదాడు. ఉగ్రవాదుల దాడిగా అనుమానించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అజయ్ మరణించాడు. కాగా గుర్తింపు పొరపాటు వల్ల జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని ఐజీ విజయ్ కుమార్ అన్నారు. జరిగిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
మరోవైపు జమ్ముకశ్మీర్లో గుర్తింపు పొరపాటు వల్ల సెక్యూరిటీ సిబ్బంది గతంలో రాత్రి వేళ జరిపిన కాల్పుల్లో పలువురు పౌరులు కూడా చనిపోయారు.