న్యూఢిల్లీ, జనవరి 27 : కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ప్రాతిపదిక వివక్షను కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన కొత్త నిబంధనలపై వివాదం రేగింది. ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతాయని, తప్పుడు ఫిర్యాదులకు శిక్ష విధించే నిబంధన లేదని అనేక వర్గాలు యూజీసీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ కింద కేంద్ర ప్రభుత్వం స్థాపించిన స్వయం ప్రతిపత్తితో కూడిన యూజీసీ జనవరి 13న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్, 2026 పేరిట జారీచేసిన ఈ నిబంధనల ప్రకారం వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీలకు చెందిన విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి 24/7 గ్రీవెన్స్ హెల్ప్లైన్ల ఏర్పాటుతోపాటు సమాన అవకాశాల కేంద్రాలను, సమానత్వ కమిటీలను అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
విద్యార్థులు, బోధన, భోధనేతర సిబ్బంది, పాలనాధికారులతోసహా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని విభాగాల సభ్యులకు యూజీసీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. ఈ నియమాలు వివక్షను విస్తృతంగా నిర్వచించాయి. బహిరంగ చర్యలను మాత్రమే కాకుండా సమాన గౌరవాన్ని దెబ్బతీసే లేదా మానవ గౌరవాన్ని ఉల్లంఘించే సూక్ష్మ లేదా పరోక్ష పద్ధతులు కూడా వివక్ష కిందకు వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులతోపాటు ఆర్థికంగా బలహీన వర్గాలు, దివ్యాంగుల రక్షణపై ఈ నిబంధనలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తాయి. వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, నమోదు చేసి, పరిష్కరించే వ్యవస్థలను ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. నిత్య పర్యవేక్షణ, అంతర్గత నివేదన యంత్రాంగాల ఏర్పాటు తప్పనిసరి. ఈ నిబంధనలకు చట్టపరంగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. నిబంధనలకు కట్టుబడని విద్యా సంస్థలకు అకడమిక్ ప్రోగ్రామ్ల తిరస్కరణ, యూజీసీ ఫండింగ్ పథకాలకు అనర్హత లేదా సంస్థాపరమైన గుర్తింపు ఉపసంహరణసహా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు జనరల్ క్యాటగిరీ విద్యార్థులపై వివక్షకు దారితీస్తాయని, వేధింపులకు పాల్పడుతున్నది వారేనన్న భావనను కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. తప్పుడు ఫిర్యాదులు లేదా దురుద్దేశపూర్వక ఫిర్యాదులకు పాల్పడే నిందితులపై ఏ విధమైన చర్యలు తీసుకునేది ప్రస్తావించకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కమిటీ నివేదికపై నిందితుడు అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇవ్వడం, అప్పీలుపై నిర్ణయం తీసుకునేందుకు అంబుడ్స్మన్కు మరో 30 రోజుల వ్యవధి ఇవ్వడం నిబంధనలలో పొందుపరిచినప్పటికీ తప్పుడు ఫిర్యాదులని రుజువైతే తీసుకునే శిక్షార్హమైన పర్యవసానాలు ఏమిటో చెప్పకపోవడాన్ని విమర్శిస్తున్నారు.
యూజీసీ నిబంధనలు విద్యార్థి లోకాన్నే కాక రాజకీయ నేతల్లో సైతం నిరసనలను రాజేసింది. ఉత్తరప్రదేశ్లోని సీనియర్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి, బీజేపీ యువ మోర్చా నోయిడా ఉపాధ్యక్షుడు రాజు పండిట్ కొత్త విధానాన్ని వివక్షాపూరితంగా అభివర్ణిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. తన పార్టీ పదవికి రాజీనామా చేస్తూ సలోన్(రాయ్బరేలి) లోని బీజేపీకి చెందిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్యాం సుందర్ త్రిపాఠీ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. యూజీసీ కొత్త నిబంధనలకు నిరసనగా తాను తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. యూపీలోని పలువురు బీజేపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లోని అనేక చోట్ల క్యాంపస్లలో నిరసనలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. యూజీసీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. యూజీసీ నిబంధనలను సమీక్షించి వాటి అమలుపై స్టే ఇవ్వాలని అర్థిస్తూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) కూడా దాఖలైంది. మరోవైపు, నిబంధనలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.