న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ను కల్లోలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఆ రాష్ట్రం ప్రమాదకరంగా మారినట్లు ఇవాళ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సాయుధ దళాల ఏఎఫ్ఎస్పీఏ చట్టం అమలును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఇది వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. మరో వైపు సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నాగాలాండ్ నుంచి ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించాలా వద్దా అన్న అంశంపై బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ ఒకటి చర్చలు నిర్వహించింది. కానీ ప్రస్తుతం ఆ చట్టాన్ని కొనసాగించాలని ఆ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్ధాల నుంచి నాగాలాండ్లో ప్రత్యేక అధికారాలు కలిగిన ఆ చట్టం అమలులోనే ఉన్నది. ప్రమాదకరంగా మారిన నాగాలాండ్లో సైనిక దళాలతో పాటు స్థానిక పోలీసు బలగాల పహారా అవసరమని కేంద్రం అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన హింసాకాండలో 14 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మళ్లీ నాగాలాండ్లో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఎటువంటి అనుమతి లేకుండానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టి, ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఏఎఫ్ఎస్పీఏ చట్టానికి ఉంది. దీంతో ఆ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.