న్యూఢిల్లీ, జనవరి 6: ప్రయాణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై చర్య తీసుకోవడంలో సంబంధిత విమానయాన సిబ్బంది విఫలమైతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విమానయాన నియంత్రణ సంస్థ ‘ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) శుక్రవారం హెచ్చరించింది. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను నియంత్రించే సమయంలో అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు.. హ్యాండ్కఫ్స్ వంటి నియంత్రిత డివైజ్లను వినియోగించొచ్చని పేర్కొన్నది. ఇటీవల ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడం, మరో విమానంలో ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై స్పందించిన డీజీసీఏ విమాన ప్రయాణికుల ప్రవర్తనా నియమావళిపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు.
‘ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంబంధిత ఎయిర్లైన్స్ సిబ్బంది సరైన చర్య తీసుకోకపోవడం, స్పందించకపోవడం వల్ల సమాజంలో విమానయాన సంస్థల పరువు దిగజారుతుంది. నిబంధనలు పాటించని సిబ్బందిపై కఠిన చర్యలు అమలవుతాయి. అనుచిత ప్రయాణికులను అదుపు చేసే బాధ్యత సిబ్బందిదే’ అని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిస్థితిని అంచనా వేసి, తదుపరి చర్య కోసం దానికి సంబంధించిన సమాచారాన్ని గ్రౌండ్లోని ఎయిర్లైన్స్ సెంట్రల్ కంట్రోల్కు తెలియజేయాల్సిన బాధ్యత విధిగా పైలట్పైన ఉందని డీజీసీఏ తెలిపింది. అవాంఛనీయ సంఘటనలు ప్రయాణ సమయంలో జరిగితే విమానం ల్యాండ్ అయిన వెంటనే సంబంధిత సెక్యూరిటీ ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలని, అనుచితంగా, నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత ప్రయాణికుడిని వారికి అప్పగించాలని పేర్కొంది.