యూపీ, ఎంపీ, ఢిల్లీలో ఎఫ్ఐఆర్లు నమోదు
నోయిడా : జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపినందుకుగాను ట్విట్టర్పై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో భజరంగ్దళ్ ప్రతినిధి ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంలో మధ్యప్రదేశ్ పోలీసులు సైతం ఆ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్విట్టర్లో అశ్లీల చిత్రాలను చూసే విధంగా అనుమతించారని ఆరోపిస్తూ, ఆ సంస్థపై కేసు నమోదుచేయాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఢిల్లీ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో దేశ రాజధాని పోలీసులూ ట్విట్టర్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరోవైపు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్విట్టర్ ఖాతాలను ఇటీవల కొద్దిసేపు నిలిపివేయడంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ ప్యానెల్ ట్విట్టర్ను ఆదేశించింది.
ఐటీ ప్యానల్ ముందుకు ఫేస్బుక్, గూగుల్
న్యూఢిల్లీ, జూన్ 29: సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించి ఫేస్బుక్, గూగుల్ ప్రతినిధులు మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. నూతన ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆ సంస్థలకు స్పష్టంచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పౌరుల హక్కుల పరిరక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడంపై ఈ సమావేశం జరిగింది. యూజర్ల డేటా భద్రతకు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థలకు కమిటీ స్పష్టంచేసింది.