న్యూఢిల్లీ: భారత్ సహా అనేక దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కంటి వ్యాధి ‘గ్లకోమా’. సరైన సమయంలో దీనిని గుర్తించి..వైద్య చికిత్స అందించకపోతే అంధులుగా మారటం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా ‘గ్లకోమా’ వ్యాధిని వెంటనే గుర్తించే ‘కాంటాక్ట్ లెన్స్’ను బ్రిటన్, టర్కీ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో సుమారుగా 7 కోట్ల మంది గ్లకోమాబారిన పడ్డారని సమాచారం. ఇందులో సగం మందికి తమ కంటి సమస్య ఏంటో స్పష్టంగా తెలియదట! ఎప్పుడైనా కంటి పరీక్షకు వెళితే.. అప్పుడు వారికున్న గ్లకోమా వ్యాధి బయటపడుతున్నది. అయితే వారి కండ్లకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నదని సైంటిస్టులు తెలిపారు. సరికొత్త రకం ‘కాంటాక్ట్ లెన్స్’లను వారు అభివృద్ధి చేశారు. మైక్రో సెన్సర్లు అమర్చిన ఈ కాంటాక్ట్ లెన్స్లు కంటిలో వచ్చే సున్నితమైన మార్పులను సైతం సులభంగా గుర్తించి, ఆ సమాచారాన్ని వైద్యులకు కూడా పంపుతుందట. దీంతో సమస్య వెంటనే బయటపడుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు.