ఢిల్లీపై గుత్తాధిపత్యం సాధించాలనుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు బెడిసికొట్టాయి. ఓటర్లు ఎన్నుకొన్న ప్రభుత్వానికే పాలనాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సైతం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీలో ఏకచ్ఛత్రాధిపత్యం సాధించాలనుకొన్న కేంద్రానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
Supreme court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీ పాలనా వ్యవహారాల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రజలచే ఎన్నికైన స్థానిక ప్రభుత్వానికే ప్రభుత్వాధికారులపై శాసన, కార్యనిర్వాహణపరమైన పాలనాధికారాలు ఉంటాయని తేల్చిచెప్పింది. ప్రభుత్వాధికారులపై అక్కడి స్థానిక సర్కారుకు అధికారాలు ఉండబోవంటూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విషయంలో 2019లో అప్పటి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవించబోమని తేల్చిచెప్పింది. ఎన్నికైన స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
పబ్లిక్ ఆర్డర్, పోలీసు వ్యవస్థ, భూ వ్యవహారాల వంటి కార్యనిర్వాహక అధికారాలు మాత్రమే కేంద్రానికి ఉంటాయన్న ధర్మాసనం.. మిగతా అన్ని పరిపాలనాపరమైన అధికారాలు స్థానిక ప్రభుత్వం నియంత్రణలో ఉండాలని నొక్కిచెప్పింది. ఈ మేరకు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా కీలక తీర్పు వెలువరించింది. తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్లు ఎంఆర్ షా, కృష్ణ మురారి, హిమాకోహ్లీ, పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలో పాలనాపరమైన అధికారాల కోసం 8 ఏండ్లుగా జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో కేజ్రీ సర్కారుకి భారీ విజయం దక్కినట్టయ్యింది.
ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసులు కేంద్రం పరిధిలోకే వస్తాయంటూ 2015లో కేంద్రహోంశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు కేజ్రీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో ఆప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి అధికారాలు లేవని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏకే సిక్రీ ఈ తీర్పును వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి చేరింది.