న్యూఢిల్లీ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలతో దుమారం రేపిన కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తన వ్యాఖ్యలపై బుధవారం వివరణ ఇచ్చారు. ముర్ముకు వ్యతిరేకంగా తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ద్రౌపది ముర్ము మంచి మహిళ అని ఎన్డీఏ ఉద్దేశాలతోనే అసలు సమస్యని కుమార్ పేర్కొన్నారు.
కాగా దేశంలో దుష్ట తాత్విక భావజాలానికి ముర్ము ప్రాతినిధ్యం వహిస్తున్నారని అంతకుముందు అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నిమిషం పాటు మాట్లాడిన వీడియోలో 17 సెకండ్లు కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోను బీజేపీ నేతలు వ్యాప్తి చేశారని కుమార్ అన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఇక అంతకుముందు కుమార్ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే..విపక్షాల తరపున రాజ్యసభ అభ్యర్ధిగా బరిలో దిగిన యశ్వంత్ సిన్హా మంచి అభ్యర్ధి అని, ద్రౌపది ముర్ము మంచి వ్యక్తే అయినా ఆమె దుష్ట తాత్విక సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కుమార్ వ్యాఖ్యానించారు.
ఆమెను ఆదివాసీల ప్రతినిధిగా మనం చూడలేమని, రాంనాధ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికైనా ఎస్సీలపై వేధింపులు జరుగుతున్నాయని ప్రస్తావించారు. గత కొన్నేండ్లుగా దళితుల పరిస్ధితులు దిగజారాయని వ్యాఖ్యానించారు. ఇక జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తే ఆమె దేశంలో తొలి గిరిజన రాష్ట్రపతిగా ఎన్నికవడంతో పాటు దేశ రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండవ మహిళ అవుతారు.