న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై బీబీసీ ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ డాక్యుమెంటరీని ఇండియాలో ప్రమోట్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ వ్యతిరేకించారు. బీజేపీతో సైద్ధాంతికి విబేధాలు ఉన్నా.. భారత్పై బీబీసీ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన తీరు సరిగా లేదని తాజాగా ఓ ట్వీట్లో అనిల్ ఆంటోనీ పేర్కొన్నారు. కేరళ కాంగ్రెస్ డిజిటల్ మీడియా(ఐటీ వింగ్) ఇంచార్జీగా ఉన్న అనిల్ చేసిన ఆ ట్వీట్ ప్రకంపనలు సృష్టించింది. ఇక కాంగ్రెస్లో ఉన్న పార్టీ నేతలే అనిల్ను టార్గెట్ చేశారు. ఆ ట్వీట్ను వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ ఏమాత్రం సహించని అనిల్.. ఇప్పుడు ఆ పార్టీనే వీడారు.
తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అనిల్ ఆంటోనీ తాజాగా కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు. దానికి సంబంధించిన విషయాన్ని తన ట్విట్టర్లో ఆయన పోస్టు చేశారు. భారతీయ వ్యవస్థలపై బీబీసీ వెల్లడించిన అభిప్రాయాలు మన దేశ సార్వభౌమమత్వాన్ని దెబ్బతీసేదిగా ఉన్నట్లు అనిల్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. భావ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న నేతలే తన ట్వీట్ను తొలగించాలని కోరడం తనకు నచ్చలేదని అనిల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వంతపాడేవారు, చెంచాలు ఎక్కువైనట్లు ఆరోపించారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రెండు భాగాలతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంటరీని ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. దాంట్లో నిష్పాక్షికత లోపించినట్లు పేర్కొన్నది. ఆ డాక్యుమెంటరీ షేరింగ్ను కూడా నిలిపివేస్తూ గత వారం యూట్యూబ్, ట్విట్టర్ పోస్టులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW
— Anil K Antony (@anilkantony) January 25, 2023